శబరిమల మాదే... మాకే అప్పగించండి...

Update: 2018-11-06 07:25 GMT

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలు అనుమతించాలంటూ సుప్రీం కోర్టు సంచలనతీర్పు ఓ పక్క రాదాంతం జరుగుతుండగా మరో వివాదం తెరపైకి వచ్చింది. శబరిమల ఆలయం తరతరాలుగా తమదని, తమ ఆలయాన్ని తమకు అప్పగించాలని, లేదంటే తాము సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి సాధించి తీరుతామని కేరళకు చెందిన మాల ఆర్యులు డిమాండ్‌ చేస్తున్నారు. 

‘12 శతాబ్దానికి చెందిన శబరిమలలోని అయ్యప్ప ఆలయం మాల ఆర్యులది. పండలం రాజ కుటుంబం 1800లో దీన్ని ఆక్రమించుకున్నారు. ఆలయంలోని పలు దేవతా విగ్రహాలను తొలగించి వాటిని అడవుల్లో విసిరేశారని వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్టించడం జరిగిందన్నారు. చరిత్రగతిలో అడవుల్లో పడేసిన విగ్రహాలు కరిమల, పొన్నంబాల్మేడు, కొత్తకుతితార, నీలక్కల్, తలపరమల అడవుల్లో దొరికాయి. 1904లో పండలం రాజు ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాహ్మణ వర్గానికి చెందిన తాజమన్‌ కుటుంబాన్ని తీసుకొచ్చి ప్రధాన పూజారి బాధ్యతలను అప్పగించారు. అప్పటి వరకు ద్రావిడ పద్ధతిలో జరిగిన పూజాది కార్యక్రమాలను మార్చివేసి బ్రాహ్మణ పద్ధతులను ప్రవేశ పెట్టారు. గతంలో అయ్యప్పకు పూజారులుగా వ్యవహరించిన మాల ఆర్యులు తేనతోనే అభిషేకం చేసేవారు. ఆ స్థానంలో బ్రాహ్మణ పూజారులు పాలతోని అభిషేకం చేయడం ప్రారంభించారు. 1950లో ట్రావెన్‌కోర్‌ దేవసం బోర్డు ఆలయ పాలనా బాధ్యతలను స్వీకరించింది. 

ఈ ఆలయాన్ని తిరిగి అప్పగించాల్సిందిగా ముందుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఆ తర్వాత అవసరమైతే సుప్రీం కోర్టు వరకైనా వెళ్లి న్యాయం సాధిస్తాం. అన్ని వయస్కుల మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం మా మంచికే జరిగిందేమో! మా గొంతును కూడా ఈ ప్రపంచానికి వినిపించేందుకు అవకాశం దొరికింది. మాకు ఆలయాన్ని అప్పగించినట్లయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేస్తాం. మా గుండెల నిండా ఎప్పుడూ గూడుకట్టుకొనే ఉండే మా అయ్యప్ప మహిళల పట్ల ఎప్పుడూ వివక్షత లేదు’ అని ఐక్య మాల ఆర్య మహా సభ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పీకే సజీవ్‌ చెప్పారు. 

Similar News