డ్రైవర్ లేకుండానే దాదాపు 90కిలోమీటర్ల ప్రయాణించిన గూడ్స్ రైలు ఆ తర్వాత పట్టాలు తప్పి కుప్పకూలిపోయింది. పెద్ద మొత్తంలో ఇనుప ధాతువును తరలిస్తున్న నాలుగు ఇంజిన్లు, 268 వ్యాగన్లు గల రైలు సోమవారం ఉదయం పశ్చిమ ఆస్ట్రేలియాలోని న్యూమన్ నుంచి పోర్ట్ హెడ్ల్యాండ్కు వెళ్తోంది. అయితే ఉదయం 4.40 నిమిషాల సమయంలో పోర్ట్హెడ్ ల్యాండ్కు ఇంకా 210దూరంలో ఉండగా డ్రైవర్ రైలును ఆపి కిందకు దిగి ఓ వ్యాగన్ను పరీక్షిస్తుండగా రైలు దానంతట అదే ముందుకు కదిలింది. కాగా డ్రైవర్ లేకుండానే దాదాపు 90కిలోమీటర్లు ప్రయాణించి, తర్వాత రైలు వ్యాగన్లు పట్టాలు తప్పి పడిపోయాయి. ఉదయం 5.05 సమయంలో అధికారులు రైలును ఆపగలిగారు. కానీ అప్పటికే కొన్ని వ్యాగన్లు పట్టాలు తప్పి పట్టాల పక్కన చిందర వందరగా పడిపోయాయి. ఈ కారణంగా సుమారు 1500మీటర్ల మేర పట్టాలు ధ్వంసమయ్యాయి. 268 వ్యాగన్లు కల ఈ భారీ గూడ్సు రైలు పొడవు దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, ఎవ్వరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టమని అధికారులు వెల్లడించారు.