జార్ఖండ్కు చెందిన ఓ బీజేపీ ఎంపీపై నెటిజన్లు మండిపడుతున్నారు. గొడ్డా పార్లమెంట్ నియోజక వర్గ ఎంపీ నిశికాంత్ దుబే ఆదివారం ఓ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన ప్రసంగించిన అనంతరం పవన్ అనే బీజేపీ కార్యకర్త ఓ ప్లేటు, లోటాలో నీళ్లు తీసుకుని ఎంపీ కాళ్ల వద్ద కూర్చున్నాడు. ప్లేటులో దూబే కాళ్లు కడిగి, తువాలుతో పాదాలు శుభ్రంగా తుడిచాడు. పాదాలు కడిగిన నీటిని తాగి తలపై చల్లుకున్నాడు. ఈ సందర్భంగా అక్కడున్న వారంతా ‘‘పవన్ భాయ్ జిందాబాద్’’ అని నినాదాలు కూడా చేశారు. దీనికి సంబంధించి వీడియోను నిశికాంత్ తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ఎంపీ అయ్యి ఉండి ఓ కార్యకర్తతో అలా చేపించడమేంటని ధ్వజమెత్తారు. కాళ్లు కడిగిన నీళ్లు తాగుతుంటే ఏం చేస్తున్నావంటూ నిప్పులు చెరిగారు. ఓ కార్యకర్త తెలిసో తెలియకో అలా చేస్తే, సర్ధి చెప్పాల్సింది పోయి, ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారా అంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి ఆ వీడియోను నిశికాంత్ తొలగించారు. ఇది జార్ఖండ్లో సర్వసాధారణమని, మహాభారతంలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు సుదామ కాళ్లు కడిగారని గుర్తు చేస్తూ ఈ సంఘటనను నిశికాంత్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు.