తెలంగాణలోని రెండు ప్రాంతాల్లో కేసీఆర్ కు ఓటు హక్కు ఉందని ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని టీకాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎర్రవల్లి, చింతమడక గ్రామాల్లో కేసీఆర్ ఓటు హక్కు నమోదు చేసుకున్నారని, రెండు ప్రాంతాల్లో ఆయన ఎలా నమోదు చేసుకుంటారని ప్రశ్నించారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని, కేసీఆర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 11న ప్రజాకూటమి గెలవబోతోందని, గెలుపును ఆస్వాదించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు.ఆదివారం రేవంత్రెడ్డి హైదరాబాద్లోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...‘చింతమడక(సిద్దిపేట)లో పార్ట్ నం.13, సీరియల్ నం.136, ఎపిక్ నం.ఎస్ఏజి0399691లో కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, తండ్రి రాఘవరావు పేరుతో ఒక ఓటు; ఎర్రవల్లి(గజ్వేల్) పార్ట్ నం.284, సీరియల్ నం.655, ఎపిక్ నం.వైకెఎం1804400 లో చంద్రశేఖర్రావు కల్వకుంట్ల, తండ్రి రాఘవరావు కల్వకుంట్ల పేరుతో.. ఇంటి పేర్లు అటు ఇటుగా మార్చి రెండో ఓటు నమోదు చేసుకున్నారు’ అని వివరించారు. తన విలేకరుల సమావేశం వివరాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదుగా స్వీకరించి తక్షణం కేసీఆర్పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.