రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా... నాలుగున్నర ఏళ్లలో తొలిసారిగా కీలక వడ్డీ రేట్లు పెంచింది. కీలక వడ్డీరేట్లను పావు శాతం పెంచుతూ ఆర్బీఐ... పరపతి విధాన కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండో ద్వైమాసిక పరపతి విధాన సమావేశం... ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల ఎంపీసీ మూడు రోజుల పాటు జరిగింది. ఈ సమావేశంలో కీలక వడ్డీరేట్లను పావుశాతం పెంచాలని ఎంపీసీ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఆర్బీఐ నిర్ణయం ప్రకారం... ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి పెరిగింది. రివర్స్ రెపో రేటు 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచారు. ద్రవ్యోల్బణ భయాలు, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటమే రేట్ల పెంపునకు కారణమని భావిస్తున్నారు. అయితే ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచడం నాలుగున్నరేళ్లలో ఇదే తొలిసారి. చివరి సారిగా జనవరి 2014లో రెపో రేటును 8 శాతానికి పెంచింది. ఆ తర్వాత రేట్లను తగ్గించడం లేదా యథాతథంగా ఉంచుతూ వస్తోంది.