గత కొన్ని రోజులుగా టీఆర్ఎస్లో అసంతృప్తిగా ఉన్న మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ తాజాగా ఆ పార్టీకి గుడ్బై చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. అంతేకాదు ఆ పార్టీ తరఫున ఖానాపూర్ నుంచి రమేశ్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. టీఆర్ఎస్ ఈ నెల ఆరో తేదీన ప్రకటించిన జాబితాలో ఖానాపూర్ టిక్కెట్ను తాజా మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్కు కేటాయించడంతో రమేష్ రాఠోడ్ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తెదేపా పోలిట్బ్యూరోలో కొనసాగుతున్న రమేష్ రాఠోడ్ ఏడాది కిందట ఖానాపూర్ ఎమ్మెల్యే టిక్కెట్టే ఒప్పందంగా తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలో తెరాస తీర్థం పుచ్చుకున్నారు. చివరి నిమిషంలో తెరాస టిక్కెట్టు నిరాకరించడంతో ఈ నెల ఎనిమిదో తేదీన ఉట్నూర్ కేంద్రంగా భారీ ర్యాలీ నిర్వహించారు. టిక్కెట్ రాకపోయినా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగానైనా పోటీచేయడం ఖాయమని స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపిన ఆయన రేపు గాంధీభవన్ వేదికగా ఆ పార్టీలో చేరాలని నిర్ణయించారు.