ఓ వైపు వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వాలంటూ బాబా రాందేవ్ను.. బీజేపీ అగ్రనాయకత్వం కలిసి విజ్ఞప్తి చేస్తుండగా.. మరోవైపు అదే పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో మాత్రం యోగా గురుకు ఎదురుదెబ్బ తగిలింది. పతంజలీ సంస్థ సుమారు 6 వేల కోట్లతో గ్రేటర్ నోయిడాలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఫుడ్ పార్క్కు సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చే విషయంలో.. జరుగుతున్న తాత్సారంపై రాందేవ్ బాబా.. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ పై అసహనంతో ఉన్నారు. ఎన్నిరోజులైనా విషయం తేల్చకపోవడంతో విసుగుచెందిన రాందేవ్.. చివరకు తన ఫుడ్ పార్క్నే తరలించాలని నిర్ణయించారు. ఇటు ఫుడ్ పార్క్ స్కీమ్ కోసం కేంద్రానికి సమర్పించాల్సిన అర్హత పత్రాలను.. కంపెనీ పొందలేకపోయిందని పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణ చెప్పారు. పేపర్ వర్క్ విషయంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆలస్యం చేస్తూ పోతుందని.. ఈ ప్రాజెక్ట్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదన్నారు. అందుకే ఈ ప్రాజెక్ట్ను యూపీ నుంచి తరలించాలని నిర్ణయించామని వివరించారు.