టీమిండియా మాజీ దిగ్గజాలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్లు బీజేపీలో చేరబోతున్నారా? అవుననే అంటున్నారు బీజేపీ నేతలు. వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారిద్దరినీ ఎలాగైనా పార్టీలో చేర్చుకోవడం ద్వారా లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోంది. మే నెలలో కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరిని బరిలోకి దించి ప్రచారం చేయించాలని భావిస్తోంది. ఐతే, వీరిద్దరూ రాజకీయ ప్రవేశం చేసేందుకు సిద్ధంగా లేనట్లు సమాచారం.
ఇదే విషయాన్ని స్థానిక భాజపా నేతలు అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్లతో చర్చించగా వీరు విముఖత చూపించారు. అయితే వారిని ఎలాగైనా ఒప్పించాలని భాజపా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వారిలో ఒకరిని రాష్ట్ర అసెంబ్లీ బరిలోకి దింపి.. మరొకరిని జాతీయ రాజకీయాల్లోకి పంపుతామని కూడా ఆఫర్ ఇచ్చింది. అయితే వారు రాజకీయాల్లోకి వచ్చేందుకు నిరాకరించినట్లు సమాచారం. దీనిపై భాజపా నేతలు మాట్లాడుతూ.. ‘కుంబ్లే, ద్రవిడ్తో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. కనీసం వారిలో ఒకరినైనా లోక్సభ లేదా రాజ్యసభ బరిలో దింపుతాం. ఇంకా మాకు ఆశలు ఉన్నాయి.’ అని తెలిపారు. ఇదే విషయంపై కుంబ్లే, ద్రవిడ్ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. కర్ణాటకలో మే 12న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.
అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన కుంబ్లే ఆ తర్వాత భారత జట్టుకు కోచ్గా సేవలు అందించారు. ప్రస్తుతం ఐపీఎల్ 11వ సీజన్కు కామెంటేటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. మరో పక్క ద్రవిడ్ ఇండియా-ఎ, అండర్-19 జట్లకు కోచ్గా ఉన్న సంగతి తెలిసిందే.