పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయపతాకం ఎగరవేసింది. ఈ ఏడాది ప్రథమార్థంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ నిన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం సత్తా చాటింది. జలంధర్, పటియాలా, అమృతసర్లలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందింది. జలంధర్ మున్సిపల్ కార్పొరేషన్లో 80 స్థానాలకు గాను 66 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించగా బీజేపీ, అకాళీదళ్ల కూటమి 12 స్థానాలను మాత్రమే కైవసం చేసుకుంది. రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ పాలసీలకు ప్రజలు మరోసారి పట్టం కట్టారని ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ అన్నారు. విద్వేషపూరిత భావజాలాన్ని ప్రచారం చేస్తున్న ప్రతిపక్షానికి మున్సిపల్ ఎన్నికల తీర్పు చెంపపెట్టు అని చెప్పారు.