హడావుడికి తక్కువేం ఉండదు. హంగామాకు కొదువే కనిపించదు. చుట్టూ ఎవరూ లేకున్నా. పర్ఫార్మెన్స్ లో మాత్రం ఫస్ట్ క్లాస్ కొట్టేస్తారు. ప్రజల్లోకి వెళ్లే సమయంలో తమ బలం, బలగం చూపించే వేదికగా ఎన్నికలనుకునే నాయకులు.. మనదేశంలో చాలామందే ఉన్నారు. కనీసం ప్రజల దగ్గరకు వెళ్లి ఓట్లెలా అడగాలో కూడా తెలియని లీడర్లు అడుగడుగునా కనిపిస్తారు. తెలంగాణ ఎన్నికల్లో అచ్చం అలాగే కనిపిస్తున్నారు కొందరు లీడర్లు.
మెదక్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య చేస్తున్న ప్రచారం. ఈ విజువల్స్ చూస్తుంటే ఎవరినో బెదిరించేందుకు లేక ఎవరితోనైనా గొడవపెట్టుకునేందుకు వెళ్లినట్లే కనిపిస్తున్నాయి. పక్కన లీడర్ల కంటే బౌన్సర్లే అధికంగా ఉన్న ఈయన గారి హడావుడి చూస్తే ఓటర్లే భయపడుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగానే సంపాదించిన ఆకుల రాజయ్య తర్వాత రాజకీయాల్లోకి దిగారు. తనది మెదక్ కాకపోయినా అక్కడి నుంచి బరిలోకి దిగుతున్నారు. దీంతో స్థానిక నాయకుల నుంచి సహకారం అంతంత మాత్రంగానే ఉండటంతో పర్ఫార్మెన్స్లో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు.
ఆయన వెంట వచ్చిన మహిళలకు జెండాలు అప్పగించారు కానీ వారితో కలిసి ప్రచారం చేయడం లేదు. బౌన్సర్లను వెంటేసుకునే ఓట్లడుతున్నారు. దీంతో ఆయన్ను దగ్గరగా చూసిన ఓటర్లు కొంత జంకుతున్నారు. ప్రచారం సమయంలోనే ఇంతలా భయపెడితే ఒకవేళ ఎన్నికైతే పరిస్థితి ఎలా ఉంటుందో అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా బౌన్సర్లతో ఓట్లడుగుతున్న రాజయ్య ప్రచారం ప్రస్తుతం తెలంగాణ ఎన్నికల్లో హాట్ టాపిక్గా మారింది.