తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్పై కన్నడిగులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కావేరీ జలాలపై ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రజనీకాంత్ స్పందిస్తూ.. తీర్పు తనను తీవ్ర నిరాశకు గురిచేసిందని, కోర్టు తీర్పు తమిళ రైతుల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రజనీ వ్యాఖ్యలపై కన్నడిగులు నిరసన వ్యక్తం చేస్తూ ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. రామ్నగర్ జిల్లాలోని చన్నపట్నలో ఆందోళనకారులు రజనీకాంత్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఆయన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని, కన్నడిగులకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
‘‘కావేరీ తీర్పు నన్ను తీవ్రంగా కలిచివేసింది. తమిళ రైతుల జీవన విధానంపై ఈ తీర్పు తీవ్ర ప్రభావం చూపుతుంది. తీర్పుపై రివ్యూ పిటిషన్ వేసేందుకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. అయితే ఆయన తన ట్వీట్లో కన్నడిగులను ప్రస్తావించలేదు. మరో తమిళ నటుడు కమల హాసన్ కూడా కావేరీ తీర్పుపై స్పందిస్తూ ఇది తనను ‘షాక్’కు గురిచేందని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు తీర్పుపై కన్నడ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. స్వీట్లు పంచుకున్నారు.