ఫిల్మ్‌ ఛాంబర్‌‌ దగ్గర ఉద్రిక్తత

Update: 2018-04-20 08:25 GMT

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పవన్‌ పిలుపుతో పెద్దఎత్తున ఫిల్మ్‌ ఛాంబర్‌‌కి చేరుకున్న జనసేన కార్యకర్తలు, మెగా పవన్‌‌ అభిమానులు ఆందోళనకు దిగారు. పవన్‌‌కి మద్దతుగా ఫిల్మ్‌ ఛాంబర్‌‌ను ముట్టడించిన ఫ్యాన్స్‌‌ వర్మకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పవన్‌ కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటున్న అభిమానులు వర్మకి తగిన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

జనసేన కార్యకర్తలు, మెగా అభిమానుల రాకతో ఫిల్మ్‌ ఛాంబర్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. పవన్‌ పిలుపుతో అభిమానులు తరలివస్తుండటంతో ఫిల్మ్‌‌నగర్‌ రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇక పవన్‌‌కి మద్దతుగా సినీ ప్రముఖులతోపాటు మెగా ఫ్యామిలీ మొత్తం ఫిల్మ్ ఛాంబర్‌కి క్యూకడుతున్నారు. నాగబాబు ఇప్పటికే పవన్‌‌తో కలిసి ఫిల్మ్‌ ఛాంబర్‌కి రాగా ఆ తర్వాత అల్లు అర్జున్‌, సాయిధరమ్‌తేజ్‌, రామ్‌ చరణ్‌‌ సైతం ఛాంబర్‌‌కి వచ్చారు.

నాగబాబుతో కలిసి ఫిల్మ్‌ ఛాంబర్‌కి వచ్చిన పవన్‌ కల్యాణ్‌‌ న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నారు. వర్మపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్న జనసేనాని మీడియాతో మాట్లాడాక దీక్షకు దిగుతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఫిల్మ్‌ ఛాంబర్‌లోనే దీక్ష చేపడతారా? లేక మరో ప్లేస్‌‌ను ఎంచుకుంటారా? అసలు దీక్షకి దిగుతారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.

పవన్‌ కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ఏకమవుతోంది. పవన్‌ తల్లిపై శ్రీరెడ్డి-వర్మ కలిసి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రగిలిపోతున్న మెగా ఫ్యామిలీ జనసేనానికి మద్దతుగా ఫిల్మ్‌ ఛాంబర్‌కి తరలివస్తున్నారు. పవన్‌‌తో కలిసి నాగబాబు ఫిల్మ్‌ ఛాంబర్‌కి రాగా ఆ తర్వాత అల్లు అర్జున్‌, సాయిధరమ్‌తేజ్‌, రామ్‌ చరణ్‌‌ సైతం ఛాంబర్‌‌కి వచ్చారు. ఇక సినీ పరిశ్రమ కూడా పవన్‌‌కు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. పలువురు సినీ ప్రముఖులు పవన్‌‌కు మద్దతుగా సోషల్‌ మీడియాలో స్పందిస్తుంటే మరికొందరు ఫిల్మ్‌ ఛాంబర్‌‌కి తరలివస్తున్నారు.

Similar News