ప‌వ‌న్ కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించిన ఫయాజ్

Update: 2018-01-27 11:30 GMT

అనంతపురం జిల్లా పర్యటనలో పవన్‌కల్యాణ్‌ను, ఆయన అభిమానులను ఖంగుతినిపించాడు ఓ వీరాభిమాని. జనసేన పార్టీ కార్యాలయం శంకుస్థాపన అనంతరం వేదికపై పవన్ ప్రసంగించారు. అక్కడే ఓ అభిమాని సెల్ఫీ కోసం వేదికపైకి దూసుకొచ్చి.. పవన్‌ను గట్టిగా తన కౌగిట్లో బంధించేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఆందోళన చెందారు. పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది అతన్ని విడిపించేందుకు ప్రయత్నించినా వదల్లేదు. అతని పిచ్చి అభిమానాన్ని అర్థం చేసుకున్న పవన్ సెల్ఫీ దిగి పంపించారు. 

అనంతపురం జిల్లాలో పర్యటించిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఓ వీరాభిమాని ముచ్చెమటలు పట్టించాడు. బహిరంగ సభలో పవన్ ప్రసంగం పూర్తవగానే ఓ అభిమాని ఉన్నట్టుండి సడన్‌గా వేదికపైకి దూసుకొచ్చాడు. ఒక్కసారిగా పవన్‌కల్యాణ్‌ను గట్టిగా కౌగిలించుకున్నాడు. ఎంతమంది విడిపించినా పవన్‌ను వదిలిపెట్టలేదు.

పవన్ కల్యాణ్  కూడా అంతే ప్రేమగా వీరాభిమానిని స్వీకరించి దగ్గరికి తీసుకున్నాడు. దాదాపు 40 సెకన్లపాటు తన ఆత్మీయ కౌగిట్లో బంధించాడు. గట్టిగా పట్టుకున్న అభిమానికి సర్దిచెప్పిన పవన్ స్వయంగా సెల్ఫీ దిగి.... వీరాభిమానిని కిందికి పంపాడు.  

అభిమాని ఇచ్చిన షాక్‌తో అక్కడున్నవారంతా అతను అభిమానేనా..? లేక ఏదైనా అఘాయిత్యానికి పాల్పడేందుకు వచ్చాడా అని ఆందోళన చెందారు. అయితే, తాడిపత్రికి చెందిన ఫయాజ్ పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. 

జిల్లాలో పవన్ పర్యటన విషయం తెలుసుకున్న ఫయాజ్ అనంతపురం చేరుకున్నాడు. ఎలాగైనా పవన్‌తో సెల్ఫీ దిగాలని భావించి ఇలా తన పిచ్చి ప్రేమను చాటుకున్నాడు. ఇతని వీరాభిమానం ఏమో గానీ.. ఈ ఘటనతో పవన్‌తోపాటు అక్కడున్నవారందరికీ ముచ్చెమటలు పట్టాయి. 

Similar News