ఎన్నికల్లో పవనాస్త్రం...175 స్థానాలకు పోటీకి సిద్ధం

Update: 2018-05-02 10:21 GMT

2019 ఎన్నికలే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. హైదరాబాద్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమైన జనసేనాని... పార్టీ బలోపేతం, ప్రత్యేక హోదా, విభజన హామీలతో పాటూ ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. 2019 ఎన్నికల్లో 50 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తుంది అనే ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన పవన్.. వచ్చే ఎన్నికల్లో ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.. 

ఆంధ్రప్రదేశ్‌లో పోటీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. హైదరాబాద్‌లో పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. సమావేశంలో వచ్చే ఎన్నికల ప్రణాళిక పై పవన్ క్లారిటీ ఇచ్చారు.. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో మాత్రమే జనసేన పోటీ చేస్తుందని కొంతకాలంగా జరుగుతున్న ప్రచారాన్ని పవన్ ఖండించారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో 175 స్థానాల్లోనూ జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. పక్క వ్యూహాంతో ముందుకు వెళుతున్నట్లు పవన్ తెలిపారు.. బూత్ స్థాయి నుండి పార్టీని బలోపేతం చెయ్యడానికి అనుసరించాల్సిన వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు పవన్ తెలిపారు... తెలంగాణ పోటీ ప్రణాళిక ఆగస్టులో తెలియజేస్తామన్నారు. 

ఇదిలా ఉండగా, జనసేన పార్టీ వ్యూహకర్తగా దేవ్‌ను నియమించారు. దేవ్‌ను పార్టీ నేతలకు ఈ సమావేశంలో పరిచయం చేసారు పవన్.. దేవ్ 350 మంది సభ్యుల టీంతో పార్టీ వ్యూహాల కోసం పనిచేస్తారని పవన్ తెలిపారు. అంతేకాకుండా దేవ్ టీంకు 1200 మంది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యకర్తలు సహకరిస్తారని పవన్ పేర్కొన్నారు. దేవ్ గత 10 నెలలుగా పార్టీకోసం పని చేస్తున్నారని. ఇకపై పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తారని పవన్ చెప్పారు. పార్టీని బూత్ లెవల్ నుండి రాష్ట్ర స్థాయి వరకూ బలోపేతం చెయ్యడం వంటి అంశాలపై కీలకంగా వ్యవహరించనున్నట్లు పవన్ తెలిపారు. ఇక పార్టీ నిర్మాణంతో పాటు ప్రత్యేక హోదా, జిల్లాల పర్యటనల విషయంలోనూ సమావేశంలో చర్చించారు. ఈ నెల 11 తేదీన పర్యటన సంబంధించి ప్రకటన చేయనున్నారు..


 

Similar News