కోల్కతా డమ్డమ్ ప్రాంతంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 8 ఏళ్ల బాలుడు మృతిచెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నగర్ బజార్ దగ్గర్లోని కాజీపర ప్రాంతంలో ఈ పేలుడు ఘటన జరిగింది. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు చెబుతున్నారు. పథకం ప్రకారమే బాంబు అమర్చి పేల్చారని పోలీసులు చెప్పారు. టైమర్ ద్వారా బాంబు పేల్చినట్లు పోలీసులు వివరించారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో భయబ్రాంతులకు గురైన ప్రజలు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాంబు నిర్వీర్య బృందాలు ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పడుతున్నాయి. క్షతగాత్రులను ఆర్జీ కర్ ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.