కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు తీర్పుపై టీఆర్ఎస్ వ్యూహమేంటి..? ఉన్నత న్యాయస్థానం తీర్పుపై ఏం చేయాలనుకుంటోంది...? తీర్పును అధికార పార్టీ శిరసా పాటిస్తుందా...లేదంటే అప్పీలుకు వెళుతుందా..? అసలు కోమటిరెడ్డి , సంపత్పై కేసు గురించి టీఆర్ఎస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు..?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనససభ్యత్వం రద్దు వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మాట్లాడేందుకు టీఆర్ఎస్ నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. అన్ని విషయాల గురించి బల్లగుద్దిమరీ వాదించే టీఆర్ఎస్ లీడర్లు కోర్టు తీర్పుపై స్పందించేందుకు మాత్రం వెనకాడుతున్నారు. ఈ అంశంపై ఎవరూ మాట్లాడొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించడం వల్లే అంతా మౌనం దాల్చారని తెలుస్తోంది.
హైకోర్టు తీర్పు గురించి బయటకు ఎవరూ మాట్లాడకపోయినా తదుపరి కార్యాచరణపై కేసీఆర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని సమాచారం. ఈ అంశాన్నిఇంకా సాగదీయటమా ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టడమా అనే అంశంపై తర్జనభర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో కోర్టులు చట్టసభలు, స్పీకర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పులు, ఆయా సందర్భాల్లో ప్రభుత్వాలు వ్యవహరించిన ఘటనల గురించి అధ్యయనం చేస్తున్నారు. ఒకవేళ అప్పీలుకు వెళితే..హైకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకున్నట్లు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదంటే..అసెంబ్లీని సమావేశపర్చి హైకోర్టు తీర్పును తిరస్కరించాలనే యోచనలో ఉన్నారని అంటున్నారు.
శాసన సభ్యత్వం రద్దు కేసులో ఇలాంటి నిర్ణయం వెలువడుతుందని ఎవరూ ఊహించలేదు. తీర్పు పూర్తి వ్యతిరేకంగా వస్తుందని ఎవ్వరూ భావించలేదు. ఎందుకుంటే..అసెంబ్లీలో జరిగిన ఘటనలో హైకోర్టు జోక్యం చేసుకోదనే టీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి వాదిస్తూ వచ్చారు. అసెంబ్లీలో జరిగిన వ్యవహారంతో హైకోర్టుకు సంబంధం లేదని గట్టిగా చెప్పారు. కానీ అంతా ఒకటి తలిస్తే ...తీరా మరొకటి అయ్యింది. తీర్పు వ్యతిరేకంగా రావడంతో గులాబీ దళం కంగుతింది.