తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ తాను అనుకున్న దారిలో దూసుకుపోతున్నారు. పార్టీలో వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకొంటూనే తన పీఠాన్ని కాపాడుకుంటున్నారు. పాదయాత్రలు చేయాలనుకున్న నేతలకు AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనే నో చెప్పించడం సీనియర్లు తనపై ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వకుండా వంటి ఎత్తుగడలు వేస్తున్నారు.
తెలంగాణ పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేప్పటి మూడేళ్లు దాటింది. కొద్ది నెలలుగా పీసీసీ అధ్యక్షుడి మార్పుపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. ఉత్తమ్ అందరిని కలుపుకు పోవడం లేదని సీనియర్లు గతంలోనే రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారు. ఇటీవల ఉత్తమ్ సైతం పీసీసీ చీఫ్గా కొనసాగడం AICC నిర్ణయానికి వదిలివేశానని చెప్పడంతో త్వరలోనే పీసీసీలో పెను మార్పులు ఉంటాయని అంతా అనుకున్నారు. ఇటీవల ఒడిషాలో పార్టీ సమూల ప్రక్షాళన చేయడంతో ఇక్కడా కొత్త రక్తం ఎక్కిస్తారని నేతలు చెవులు కొరుక్కున్నారు.
అయితే అలాంటి సూచనలేవీ కనపడటం లేదు. చాప కింద నీరులా ఉత్తమ్ కుమార్ రెడ్డి తనదైన వ్యూహాలతో తన వ్యతిరేకులను నోరెత్తనీయకుండా చేస్తున్నారు. ఇటీవలే ఉత్తమ్పై కంప్లైంట్ చేయడానికి కొందరు నేతలు ఢిల్లీ వెళ్ళారు. కానీ ముందే జాగ్రత్తపడ్డ ఉత్తమ్ అదే సమయానికి అక్కడే మూడు రోజులు బస చేశారు. ఆ నేతలు రాహుల్ని కలిసినపుడు వారి వెంటే వెళ్లారు. దీంతో ఫిర్యాదు చేయాలనుకున్న వారు సైలెంటై పోయారు.
ఓ వైపు వ్యతిరేకత తలెత్తకుండా చేస్తూనే అధిష్ఠానం దగ్గర మంచి మార్కులు కొట్టేస్తున్నారు. ఇప్పటికే బస్ యాత్రపై ఓ సారి లేఖ ద్వారా అభినందనలు తెలిపిన రాహుల్ అందరి ముందు అభినందించడంతో ఉత్తమ్ బలం పెరిగినట్టయింది. స్వయంగా రాహుల్ తన నోటితో గో ఎహెడ్ ఉత్తమ్ అనడంతో విమర్శించే నోళ్లకి తాళం వేసినట్లయిందనే చర్చ గాంధీభవన్లో జరుగుతోంది.
ఇక చేరికల విషయంలోనూ ఉత్తమ్ తన దారి రహదారిగా సాగిపోతున్నారు. సీనియర్లు వ్యతిరేకిస్తున్నా పార్టీలోకి కొత్త నేతలను తీసుకొస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి అండ్ టీంకి ఢిల్లీలో కండువా కప్పించినా పీసీసీ చీఫ్ తాజాగా మరో సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి బృందాన్ని కూడా అదే తరహాలో హస్తం గూటికి చేర్చారు. మంచోడే కానీ రాజకీయాలు తెలియవని విమర్శించిన వారితోనే ఉత్తమ్ రాజకీయాల్లో ముదిరాడని అనుకునేలా చేస్తున్నారు.