కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో కిడ్నాపైన శిశువు ఆచూకీ దొరికింది. బీదర్ ప్రభుత్వాస్పత్రిలో పాపను గుర్తించిన పోలీసులు శిశువును బీదర్ పోలీస్స్టేషన్కు తరలించారు. అయితే కిడ్నాపర్ పరారీలో ఉండటంతో ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. శిశువుకి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పాపను హైదరాబాద్ తరలించనున్నారు.
దాదాపు 29గంటల టెన్షన్కు తెరపడింది. నిన్న మధ్యాహ్నం 12గంటల సమయంలో అపహరణకు గురైన శిశువు క్షేమంగా దొరికింది. శిశువును బీదర్ తీసుకెళ్లిన కిడ్నాపర్ ఆ తర్వాత ప్రభుత్వాస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయింది. అయితే కిడ్నాపర్ ఎంజీబీఎస్ నుంచి బీదర్ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు శిశువు కోసం బీదర్ మురికివాడల్లో జల్లెడపట్టారు. చివరికి శిశువును బీదర్ ప్రభుత్వాస్పత్రిలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
శిశువు కిడ్నాపైందనే సమాచారం అందగానే వేగంగా స్పందించిన పోలీసులు చిన్నారి ఆచూకీ కనిపెట్టేందుకు తీవ్రంగా కృషిచేశారు. ఎక్కడికక్కడ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ 8 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. చివరికి కిడ్నాపర్ ఎంజీబీఎస్ నుంచి బీదర్ వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు దాదాపు 29గంటల ఆపరేషన్ తర్వాత పాపను క్షేమంగా పట్టుకున్నారు.
శిశువు కోసం పోలీసులు పెద్దగా గాలింపు చర్యలు చేపట్టడంతో భయపడిన మహిళ పాపను బీదర్ ప్రభుత్వాస్పత్రిలో వదిలి పారిపోయింది. అయితే అప్పటికే బీదర్ మొత్తాన్ని జల్లెడపడుతున్న పోలీసులకు శిశువు ప్రభుత్వాస్పత్రిలో ఉన్నట్లు సమాచారం అందింది. స్థానిక పోలీసులతో కలిసి శిశువును స్వాధీనం చేసుకున్న పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించి బీదర్ పోలీస్స్టేషన్కు తరలించారు.