దేశంలోనే పొడవైన వంతెనను ప్రారంభించనున్న ప్రధాని మోడీ

Update: 2018-12-25 04:47 GMT

ఈశాన్య రాష్ట్రాల రవాణా రంగంలో మరో విప్లవాత్మక మార్పు రానుంది. దేశంలోనే అత్యంత పొడవైన బోగీబీల్‌ రైల్ కమ్ రోడ్‌ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోడీ నేడు జాతికి అంకితం చేయనున్నారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ 4.94 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జి కింది భాగాన డబుల్ లైన్ బ్రాడ్ గేజ్‌ రైల్వే ట్రాక్  పై భాగాన మూడు లైన్ల రహదారిని నిర్మించారు. 120 సంవత్సరాల పాటు సేవలందించేలా పూర్తి స్థాయి వెల్డెడ్ స్టీల్  కాంక్రీట్ కాంపోజిట్ గర్డర్స్‌‌తో ఈ బ్రిడ్డిని నిర్మించారు. దేశంలోనే తొలిసారిగా ఇంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ బ్రిడ్జిలో 80 వేల టన్నుల స్టీల్ ప్లేట్లను వినియోగించారు. మొత్తం 5 వేల 9 వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ బ్రిడ్జిని నిర్మించారు. 

1997 జనవరిలో అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవేగౌడ ఈ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. 2002లో  డబుల్ డెక్కర్ పనులను అప్పటి ప్రధాని అటల్ బీహరి వాజ్‌పేయి ప్రారంభించారు. అప్పటి నుంచి ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు చందంగా సాగుతున్న  పనులను మోదీ అధికారంలోనే ప్రత్యేక దృష్టి సారించారు. నాలుగేళ్లలోనే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసి వాజ్‌పేయి జయంతి రోజునే జాతికి అంకితం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణంతో దిబ్రూఘర్  నుంచి ఇటా నగర్‌ల మధ్య  705 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. ఇదే సమయంలో దేశ రక్షణ రంగం మరింత బలోపేతం కానుంది. గంటల వ్యవధిలోనే దళాలతో పాటు రక్షణ పరికరాలు, వాహనాలు తరలించే వీలు కలిగింది. 

Similar News