హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఐదో రోజు ప్రపంచ తెలుగు మహాసభలు కొనసాగుతున్నాయి. యశోదారెడ్డి ప్రాంగణంలో విదేశీ తెలుగు వారితో చర్చాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. ప్రవాస భారతీయుడు నారాయణ స్వామి అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి ఎంపీ కవిత, సినీనటుడు తనికెళ్ల భరణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు భాష ప్రాచీనతపై ఎంపీ కవిత ప్రజెంటేషన్ ఇచ్చారు. మూడో శతాబ్దంలోనే కోటిలింగాల ప్రాంతంలో నాణేలు దొరికాయని ఎంపీ కవిత తెలిపారు. కరీంనగర్ జిల్లా కురిక్యాలలో కందపద్యం పుట్టింది. నన్నయ కంటే 100 ఏళ్ల ముందే తెలంగాణలో కావ్య రచన జరిగిందన్నారు. తెలుగు సాహిత్యంలో వేములవాడ సాహిత్యయుగం కీలకమని.. కాకతీయుల యుగం తెలుగుకు స్వర్ణయుగమని ఎంపీ కవిత తెలిపారు. తెలుగు అనే పదం మొదటవాడిన కవి పాల్కురికి సోమన. తెలుగులో తొలి వచన కవి కృష్ణమాచార్యులు. తొలి తెలుగు రామాయణాన్ని రచించిన కవి గోన బుద్ధారెడ్డి. తెలుగు సాహిత్యాన్ని పరిరక్షించి పది మందికి చాటిచెప్పాలని కోరారు.