కసాయి తల్లి

Update: 2017-12-12 06:48 GMT

కన్న తల్లే పైశాచికంగా ప్రవర్తించింది. పేగు బంధాన్ని మరచిపోయింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న కూతుర్ని అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసి కన్నకూతుర్ని చిత్రహింసలకు గురి చేసింది. అక్కడితో ఆగకుండా బాలికను వదిలించుకోవడానికి ప్లాన్ వేశారు. ప్లాన్‌ కాస్తా బెడసి కొట్టడంతో జైలు ఊచలు లెక్కించాల్సి వచ్చింది.

కన్నతల్లే కూతుర్ని వదిలించుకోవాలని ప్లాన్ వేసింది. తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న నాలుగేళ్ల కూతుర్ని అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌ వేసింది ఒడిషాకు చెందిన లలిత. ప్రియుడితో కలిసి పాపను చిత్రహింసలకు గురిచేసింది. పెనంను బాగా కాల్చి దానిపై బాలికను కూర్చోబెట్టింది. దీంతో బాలిక శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత బాలికను వదిలించుకునేందుకు ప్లాన్ వేశారు. 

లలిత, ప్రియుడు ప్రకాశ్‌లు తీవ్రగాయాలతో ఉన్న బాలికను తీసుకుని నాంపల్లిలోని పోలీసు భరోసా కేంద్రానికి వెళ్లారు. గాయాలతో ఉన్న అనాధ బాలిక తమకు దొరికిందని కట్టుకథ చెప్పారు. అక్కడే ఉన్న చైల్డ్‌లైఫ్‌ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేద్దామంటూ వారిని గోపాలపురం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో బాలిక అనాథ కాదని ఆమె కూతురేనని తేలింది. దీంతో వారిద్దరినీ ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 

ఒడిషాకు చెందిన లలిత మహపాత్రో కుటుంబం శ్రీకాకుళం జిల్లాకు వలస వచ్చింది. అక్కడ పరిచయమైన ప్రకాశ్‌ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కొన్ని నెలల క్రితం శ్రీకాకుళం నుంచి పారిపోయి హైదరాబాద్‌కు వచ్చారు. భార్యాభర్తలమని చెప్పి ఎస్‌ఆర్‌ నగర్‌ పరిధిలోని శ్రీనివాస్‌నగర్‌లో మకాం పెట్టారు. సమీపంలోని ఓ హాస్టల్‌లో లలిత వంట మనిషిగా, ప్రకాశ్‌ వాచ్‌మెన్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలిక తమ సంబంధానికి అడ్డుగా ఉందనే వారు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వెల్లడించారు. బాలికను చిత్ర హింసలకు గురిచేశారని చైల్డ్‌లైన్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా లలిత, ప్రకాశ్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను యూసఫ్‌గూడలోని శిశువిహార్‌కు తరలించారు.

Similar News