అల్లరిచేస్తున్న కూతురిని పొరపాటున చేయిచేసుకోవడంతో పసిపాప మృతిచెందింది.. ఆపై కూతురులేని జీవితం తనకనవసరమని తనువు చాలించింది. హృదయవిదారకరమైన ఈ ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో చోటుచేసుకుంది. కందుకూరుకు మండలం కొండసముద్రం గ్రామానికి చెందిన పరుచూరి భవ్యశ్రీ(23) తన ఏడాదిన్నర పాప ఏడుస్తూ అల్లరిచేస్తుందని కొట్టింది. దీంతో ఆయువుపట్టైన కణతికి తగిలి పాప మరణించింది. హతాశురాలైన భవ్యశ్రీ అత్తా మామలు చూస్తే తనను చంపేస్తారని బయపడింది. ఈ క్రమంలో తన కూతురు ఇక లేదన్న బాధతో లెటర్ రాసి చీరతో ఉరి వేసుకుని తాను కూడా తనువు చాలించింది. ఇంటికి వచ్చిన అత్తమామలు వీరిద్దరిని చూసి బోరున విలపించారు. కాగా భవ్యశ్రీ చనిపోతూ రాసిన లెటర్ లో ' నా చావుకు ఎవరూ బాధ్యులు కారు. నా పాప లేని జీవితం నాకవసరం లేదు. అందుకే మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్తున్నందుకు నన్ను క్షమించండి' అని సూసైడ్ నోట్లో పేర్కొంది. ఇక తెలంగాణలో బేల్దారి పనులకు వెళ్లిన భవ్యశ్రీ భర్త హుటాహుటిన కొండసముద్రం చేరుకున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.