కేరళలో ప్రకృతి ప్రకోపానికి ఎన్నో వందల మంది బలయ్యారు. భవిష్యత్లోనూ కేరళలో వచ్చిన వరదలు... దేశంలో సంభవిస్తాయని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరించింది. వచ్చే పదేళ్లలో దేశంలో వరదలకు 16 వేల మంది ప్రాణాలు కోల్పోతారని, 47 వేల కోట్ల ఆస్తి నష్టం సంభవిస్తుందని ఎన్డీఎంఏ అంచనావేసింది. ఏటా సంభవిస్తున్న ఆస్తి, ప్రాణనష్టాల సగటు ఆధారంగా ఈ అంచనాకు వచ్చింది. దేశంలోని 640 జిల్లాల్లో ముప్పుపై కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇటీవల ఒక అధ్యయనం చేయించింది.
వరదలొక్కటే కాకుండా, భూకంపాలు, కొండచరియలు విరిగిపడటం..వంటి అన్ని రకాల ముప్పుల్నీ అది పరిగణనలోకి తీసుకుంది. దీని ఆధారంగా జాతీయ విపత్తు ముప్పు సూచీని తయారుచేసింది. అధికారికంగా సూచీని విడుదల చేయలేదు. విపత్తు ముప్పులో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంటే...తర్వాత పశ్చిమ బెంగాల్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్లు ఉన్నాయ్. ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో ర్యాంకులో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ డేంజర్ జోన్లో ఉంది.