బీజేపీ కురువృద్ధుడు, తన గురువు అయిన ఎల్కే అద్వానీకి ప్రధాని మోదీ ఏమాత్రం ప్రాధాన్యమివ్వడం లేదన్న సంగతి పాతదే. ప్రాధాన్య సంగతి పక్కనబెడితే కనీస గౌరవం కూడా ఆ సీనియర్ నేతకు మోదీ ఇవ్వడం లేదని తాజా వీడియో ఒకటి చెబుతోంది. ఒక కార్యక్రమంలో అందరికీ ప్రతి నమస్కారాలు చేస్తూ వెళ్లిన మోదీ.. తనకు నమస్కరిస్తున్న అద్వానీకి నమస్కరించకుండా, అసలు ఆయనను ఏమాత్రం లెక్కచేయకుండా పోతున్నట్టుందీ వీడియోలో. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
త్రిపురలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న దృశ్యాలు కొన్ని వైరల్ అయ్యాయి. అగర్తలాలోని అసోం రైఫిల్స్ మైదానంలో శుక్రవారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో త్రిపుర కొత్త సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్జోషి.. తదితరుల ముఖ్యులంతా ఈ వేడుకకు హాజరయ్యారు. విప్లవ్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు కమ్యూనిస్ట్ యోధుడు, త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ కూడా వేదిక ఎక్కారు. కాగా, ముఖ్యఅతిథి అయిన మోదీ వేదికపైకి వస్తూ వరుసగా ఒక్కొక్కరికీ ప్రమాణాలు చేస్తూ ముందుకు నడిచారు. తొలుత అమిత్ షా, రాజ్నాథ్లకు నమస్కరించిన మోదీ.. ఆ పక్కనే చేతులు జోడించి నిల్చున్న అద్వానీవైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. అంతేనా, అద్వానీ పక్కనే ఉన్న మాణిక్ సర్కార్పై దగ్గరికి వెళ్లిమరీ ఆప్యాయత కురిపించి, రెండు సెక్లను మాట్లాడారు. అంతసేపూ అద్వానీ చేతులు దండం పెడుతూనేఉన్నా.. మోదీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. వాస్తవానికి వారి మనసుల్లో ఏముందో, లేదో తెలియదుగానీ.. ‘గురువును విస్మరించిన శిశ్యుడు..’,, ‘అద్వానీని అవమానించిన మోదీ..’ , ‘పెద్దాయనను చూస్తే జాలేస్తోంది..’ అంటూ ఈ వీడియోకు రకరకాల భాష్యాల జోడిస్తున్నారు సోషల్ మీడియాలో!