పొలం కోసం కన్నతల్లిని ట్రాక్టర్ కిందికి నెట్టేశాడు..

Update: 2018-06-23 10:52 GMT

సమాజంలో మానవత్వం మంటగలిసిపోతోంది. నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిపైనే ఓ ప్రబుద్ధుడు కర్కశంగా ప్రవర్తించాడు. భూవివాదంలో ఓడిపోయానన్న కోపంతో ఆమెను ట్రాక్టర్ ముందు లాగిపడేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాసిమ్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సదరు వ్యక్తి ఓ భూమి తగాదా కేసులో ఓడిపోయాడు. దీంతో వేరే వ్యక్తి తన ట్రాక్టర్‌తో పొలం దున్నేందుకు ప్రయత్నించాడు. భూమి తనదంటూ అతడిని అడ్డుకునేందుకు నిందితుడు తన తల్లిని ట్రాక్టర్ కిందికి నెట్టాడు. ట్రాక్టర్ ముందుకు కదలకుండా ఆమెను పైకి లేపకుండా అలాగే ఉంచాడు.
 
ఆమెకు దెబ్బలు తగిలాయా లేదా అన్నదానిపై సమాచారం లేదు. అయితే కన్నతల్లి విషయంలో అతడు చేసిన నిర్వాకంపై మాత్రం సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. దీంతో పోలీసులు మొత్తం వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టారు. తల్లిని ట్రాక్టర్‌ కిందికి నెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. ట్విటర్లో సైతం ఈ సంఘటనపై తీవ్ర విచారం వ్యక్తమైంది. ‘‘ఆ తల్లి వృద్ధాప్యంలో ఉంది. ఇంత దారుణానికి పాల్పడిన అతడిని కఠినంగా శిక్షించాలి..’’ అని ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేయగా.. ‘‘ఎంత రాక్షసుడు వీడు..’’ అంటూ మరొకరు మండిపడ్డారు. కాగా సదరు తల్లీ కుమారుల గుర్తింపు వివరాలు వెల్లడికాలేదు.

Similar News