ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లోని కేవాల్ విహార్ ప్రాంతంలో ఓ చిరుత హల్చల్ చేసింది. బుధవారం రోజు పట్టపగలే రోడ్డుపై చిరుత తిరుగుతూ ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి చెమటలు పట్టించింది. శాస్త్రబుద్ధి అనే రోడ్డులోని ఓ నివాసంలో గార్డెన్లోకి వెళ్లింది. అక్కడే కొద్ది సేపు కూర్చున్న చిరుత ఆ వెంటనే సెకన్లలో ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి క్షణాల్లో దూకడం మొదలుపెట్టింది. దీంతో ఇళ్లల్లోని మహిళలు, ముసలివారు సైతం తమ శక్తిమేరకు పరుగులు పెట్టడం మొదలుపెట్టారు.
ఒంటరిగా ఉన్నవారిపైకి దూసుకెళ్లిన చిరుత నలుగురైదుగురిని చూసి మాత్రం భయపడింది. దీంతో జనాలంతా కూడా ఒకే చోట పోగయ్యారు. ఈ తంతు దాదాపు ఆరు గంటలపాటు జరిగింది. అయితే, కాస్త ఆలస్యంగా అక్కడికి వచ్చిన అటవీశాఖ అధికారులు చిరుతకు మత్తు మందు ఇచ్చేందుకు ప్రయత్నించారు. సరిగ్గా అక్కడికి వచ్చి గన్ సిద్ధం చేస్తుండగానే చిరుత కనిపించకుండా మాయమైంది.