ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి దాదాపు వంద సీట్లతో భారీ విజయాన్ని సాధించనున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఎన్నికల్లో పాల్గొన్న తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ విలేకరులతో మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ నిర్వహించినందుకు అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనడమే ఒక నిశ్శబ్ద విప్లవానికి, చైతన్యానికి, ఏకపక్షంగా ప్రజలు ఇవ్వబోయే తీర్పుకు ఇది సంకేతం కాబోతోందన్నది తమ విశ్వాసమని అన్నారు. డిసెంబర్ 11న సంబరాలు చేసుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలకు టీఆర్ఎస్ తరపున ధన్యవాదాలు చెబుతున్నానని, 90 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో అద్భుతంగా పని చేసిన తమ నాయకులు, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.