వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళ ఆ విపత్తు నుంచి తేరుకోకముందే, మరో ముప్పు ముంచుకొచ్చింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం, కేరళలోని ఏడు జిల్లాల్లో 64.4 మిల్లీమీటర్ల నుంచి 124.4 మిల్లీమీటర్ల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సీఎంవో వెల్లడించింది. జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేరళ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. ఆయా జిల్లా అధికారులు నిరంతరం అలర్ట్గా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. సహాయక బృందాలను అందుబాటులో ఉంచారు.