కర్ణాటక కాంగ్రెస్లో ముసలం మొదలైంది. లింగాయత్ కోటాలో పదవిని ఆశించిన ఎస్ఆర్ పాటిల్.. తన పదవికి రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేసినట్టు ఆయన చెబుతున్నారు. కానీ, కారణం అది కాదని, జేడీఎస్- కాంగ్రెస్ల సంకీర్ణ ప్రభుత్వంలో ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని ఆశించారని చెబుతున్నారు. ఆ పదవి దక్కకపోవడంతో మనస్తాపానికి గురై పార్టీ పదవులకు రిజైన్ చేసినట్టు చెబుతున్నారు. కర్ణాటక కాంగ్రెస్లో ఆయన సీనియర్ నేత, ఆ రాష్ర్ట ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా!
రాష్ట్రంలో కాంగ్రెస్, జేడీఎస్ పొత్తుతో పాలన ఏర్పాటు కావడం, ఆ తర్వాత పదవులు పంపిణీలో అధిష్ఠానం పలు నిబంధనలు అమలులోకి తీసుకొస్తుండడంతో సీనియర్ నేతలు ఖంగు తింటున్నారు. మంత్రి పదవికోసం తీవ్రంగా ప్రయత్నించి అది సాధ్యం కాదని తేల్చుకున్నాకనే పార్టీ కార్యాధ్యక్ష పదవికి ఎస్.ఆర్.పాటిల్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పైకి మాత్రం ఉత్తర కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి బాధ్యతగా రాజీనామా చేస్తున్నట్లు ఎస్.ఆర్.పాటిల్ ప్రకటించారు. బాధ్యత వహించి నట్లయితే మే 15న ఫలితాలు వెలువడగా, ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం ఏమిటో కన్పించడంలేదు. ఈ మధ్యలో మరిన్ని రాజకీయ మలుపులు చోటుచేసుకున్నాయి. మరో రెండు రోజులలో మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. మే 25నే రాజీనామా లేఖ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్గాంధీకి పంపినట్లు చెబుతున్నా 9రోజుల తర్వాత ఎందుకు బహిర్గతమైందనేది తెలియరాలేదు. ఏదిఏమైనా ఎస్.ఆర్.పాటిల్ మంత్రి పదవికోసం పలు విధాల ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది.