పేదింటి ఆడపిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం మరో తీపికబురు అందించింది. నిరుపేద కుటుంబంలోని ఆడపిల్లల వివాహం కోసం ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఇస్తున్న ఆర్థిక సాయాన్ని మరింత పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని శాసనసభ వేదికగా సీఎం ఇవాళ ప్రకటించారు. ఇక నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సాయాన్ని రూ. 1,00,116లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. మొదట రూ. 51 వేలు, ఆ తర్వాత రూ. 75 వేలకు పెంచారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు 3 లక్షల 65వేల మంది మహిళలకు లబ్ధి చేకూరిందని సీఎం తెలిపారు.
పేదరికం మనషుల్ని అనేక రకాలుగా వేధిస్తుంది. పెండ్లి కోసం ఖర్చును ఊహించి భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పెళ్లిళ్లు కాకుండా చాలా మంది యువతులు అలాగే ఉండిపోతున్నారు. పరిపాలనలో అడుగడుగునా మానవీయ విలువలు ప్రతిబింబించాలని భావించి.. పేద ఆడపిల్లల పెళ్లికి ఆర్థికంగా అండదండగా నిలువాలని కల్యాణలక్ష్మీ పథకం ప్రవేశపెట్టాం. ఈ పథకం వ్యక్తిగతంగా తన హృదయానికి దగ్గరైన పథకం. జనం మెచ్చిన పథకం అని సీఎం పేర్కొన్నారు.