సినిమాలకు గుడ్ బై చెప్పి తెలంగాణ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే నిజమైన పొలిటీషియన్ అన్నచందంగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సోమవారం కొండగట్టు ఆంజనేయస్వామి దర్శనం అనంతరం కరీంనగర్లో పార్టీ కార్యకర్తలతో సమావేశమైన పవన్.... భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. రెండుతెలుగు రాష్ట్రాల్లో ప్రతిపక్షాలకు దూరంగా..ప్రభుత్వాలతో సన్నిహితంగా ఎందుకు మెలుగుతున్నారనే మీడియా మిత్రుల ప్రశ్నలకు
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు గౌరవం ఇవ్వాలని గొడవలతో సమస్యలు పరిష్కారం కావని పవన్ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలతో తాను మాట్లాడుతున్నట్టు తెలిపారు. తెలుగు రాష్ట్రాల మధ్య సున్నిత అంశాలు చాలా ఉన్నాయని, ఇరు రాష్ట్రాల్లోనూ నిర్మాణాత్మక రాజకీయ పాత్ర పోషిస్తామని పవన్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి జనసేన అధినేత పవన్ క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలకు రెండు నెలల ముందు జనసేన బలమేంటో తెలుస్తుందన్నారు.
అయితే ఈ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ తో పొత్తుకు జనసేన రెడీ అవుతుందా? అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్రజాసమస్యలే పరిష్కార మార్గమే తన లక్ష్యమన్న పవన్ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన పవన్ 2019 ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తెలంగాణలో కూడా తాము బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉన్న పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రభుత్వంతో కూడా సన్నిహిత సంబంధాల్ని కొనసాగిస్తున్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కు చెందిన జనసేన బలం పరిమితం అయినా కూడా వచ్చే ఎన్నికల బరిలో నిలిచి ప్రచారం చేస్తే ఎంతో కొంత ప్రభావం చూపించటం మాత్రం ఖాయం. ఈ విషయం తెలుసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ కూడా పవన్ తో సఖ్యతకే మొగ్గుచూపుతోంది.
దీనికితోడు గత కొంత కాలంగా సీఎం కేసీఆర్ , ఆయన తనయుడు, మంత్రి కెటీఆర్ కూడా పవన్ విషయంలో ‘సాఫ్ట్’ ధోరణితోనే ముందుకు సాగుతున్నారు. గతంలో పవన్ పై కెసీఆర్, కవితలు తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
కానీ ఇప్పుడు సీన్ మారింది. వచ్చే ఎన్నికల్లో సీమాంధ్ర ఓట్లు కీలకం అయినందున పవన్ తో పొత్తు వల్ల ఎంతో కొంత ప్రయోజనం పొందవచ్చని..ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో కూడా పవన్ వల్ల ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తున్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ కోరుకున్న సీట్లు ఇచ్చేస్తే టీఆర్ ఎస్ బలం మరింత పెరుగుతుందనేది టాక్ . అయితే జనసేన కోరే సీట్లను టీఆర్ఎస్ కేటాయిస్తుందా? లేక ఏమైనా కోత పెడుతుందా? అన్న విషయం తేలాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే. టీఆర్ఎస్ తో జనసేన దగ్గరవుతున్న విషయాన్ని గుర్తించే ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఇప్పటికే అటాక్ ప్రారంభించింది.