స్వయం ప్రకటిత, వివాదాస్పద హిందూ కోర్టు న్యాయమూర్తి, సామాజిక కార్యకర్త పూజ శకున్ పాండే మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నాథూరామ్ గాడ్సేను తాను ఆరాధిస్తానని, అప్పట్లో మహాత్మాగాంధీని ఆయన చంపకుంటే తానే ఆ పనిచేసే దానినని ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.‘‘నేటికైనా సరే.. దేశాన్ని విభజించాలని భావించే గాంధీ ఒకరుంటే, అడ్డుకునే గాడ్సే ఒకరుంటారు. నాథూరామ్ గాడ్సేను నేను ఆరాధిస్తానని చెప్పడానికి గర్విస్తున్నాను. గాంధీని గాడ్సే చంపలేదు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేలోపే అతడిని శిక్షించారు. అందరూ అసలు చరిత్ర చదవాలి’’ అని ఆ ఇంటర్వ్యూలో ఆమె పేర్కొన్నారు. గతంలో సైతం.. ట్రిపుల్ తలాక్ పేరుతో మోసపోయిన ముస్లిం మహిళలు హిందూధర్మాన్ని అనుసరించాలంటూ పూజ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు కేంద్రబిందువయ్యాయి. హిందూ కోర్టు పేరుతో అఖిల భారత హిందూ సభ(ఎబిహెచ్ఎం) కొద్ది రోజుల క్రితం మీరట్లో సొంతంగా న్యాయస్థానాన్ని ప్రారంభించి పూజ శకున్ పాండేను జడ్జిగా నియమించింది.