అనుమానం కారణంగా కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ వ్యక్తి.. అనంతరం భయంతో తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడులో జరిగింది. సిరిసేడుకు చెందిన స్వామిమల్లయ్య (48), రాధ(45) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు సంతానం. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.పెద్ద కుమారుడు కరీంనగర్ హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నాడు. కొంతకాలంగా దంపతుల మధ్య కలతలు రేగుతున్నాయి. భార్యను నిత్యం అనుమానించే మల్లయ్య ఆమెను తీవ్రంగా వేధించేవాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి వీరిమధ్య గొడవ చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన మల్లయ్య.. రాధను కర్రతోకొట్టాడు. ఆయువు పట్టున తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. భార్య మృతిచెందడంతో భయాందోళన చెందిన మల్లయ్య ఇంట్లో ఉన్న పురుగు మందు సేవించి అనంతరం ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. పొద్దున్నే తలుపు తెరిచి చూడగా ఇద్దరు విగతజీవులుగా పడివున్నారు. పిల్లలు చూసి ఒక్కసారిగా అరవడంతో స్థానికులు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.