భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త

Update: 2018-06-01 09:28 GMT

భార్య మనసు తెలుసుకున్న ఓ భర్త ఆమె అభీష్టం ప్రకారమే ప్రియుడితో పెళ్లి జరిపించాడు. అచ్చం సినిమాను తలపించేలా జరిగిన ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని చకేరి పరిధిలో చోటు చేసుకుంది. సుజిత్ అలియాస్ గోలు అనే వ్యక్తి ఫిబ్రవరి 19న శ్యామ్ నగర్‌లో శాంతి అనే యువతిని పెళ్లాడాడు. పెళ్లయిన కొద్ది రోజులకే శాంతి ఎవరికీ చెప్పకుండా అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చేసింది. ఎన్ని రోజులైనా భార్య తిరిగి రాకపోవడంతో సుజిత్ ఆమెను కలిశాడు. ఇంటికి ఎందుకు రావడం లేదో చెప్పమని అడిగాడు. ముందుగా సమాధానం దాటవేసేందుకు శాంతి ప్రయత్నించింది. భర్త గుచ్చి గుచ్చి అడిగేసరికి అసలు విషయం బయటపెట్టింది. తాను రవి అనే అతనితో ప్రేమలో ఉన్నానని, పెద్దలు బలవంతంగా సుజిత్‌కిచ్చి పెళ్లి చేశారని చెప్పి భోరుమని విలపించింది. ఆమె చెప్పింది విని మొదట షాకైన సుజిత్‌, తనను తాను నిభాయించుకుని, శాంతిని రవికిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. తర్వాత రవి ఉద్దేశం కూడా తెలుసుకున్న సుజిత్‌, తన కుటుంబసభ్యులను, శాంతి కుటుంబసభ్యులను పెళ్లికి ఒప్పించాడు. అనంతరం పోలీసుల సహాయంతో ప్రేమికులిద్దర్నీ ఏకం చేశాడు.

Similar News