భక్తి ముసుగులో ఆధ్యాత్మిక కేంద్రాలు అనైతిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. భక్తితో, మానసిక ప్రశాంతత కోసం వచ్చే మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు కొంతమంది దొంగ బాబాలు. హర్యానలోని ఫతేబాద్ తోహనా పట్టణానికి చెందిన అరవై ఏళ్ల బాబా అమరపురి ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం చేశాడు. అంతటితో అగకుండా వారందరి వీడియోలు చిత్రికరించడం సంచలనం రేపుతుంది. విషయం పోలీస్ స్టేషన్ దాకా చేరడంతో ఖాకీలు ఖంగుతిన్నారు.
కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు ఫతేహాబాద్లో అతన్ని అరెస్టు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడిగా ఉంటున్న ఆయన.. మహిళలను లొంగదీసుకున్న వీడియోలు ఇటీవల ఆన్లైన్లో దర్శనం ఇచ్చాయి. దీంతో ఆ ప్రాంతాన్ని సీజ్ చేసిన పోలీసుల, అక్కడ నుంచి కొన్ని అనుమానాస్పద వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసిన స్వామిజీని.. బాబా బాలక్నాథ్ ఆలయానికి చెందిన బాబా అమర్పురిగా గుర్తించారు. 120 మందిని రేప్ చేసిన అతను.. ఆ ఘటనలను వీడియోలో చిత్రీకరించాడు. ఆ వీడియోలతో అతను మహిళలను బ్లాక్మెయిల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బాబా ఆలయాన్ని గాలింపు చేయడం వల్ల 120 వీడియో క్లిప్లు దొరికాయని, ఒక్కొక్క వీడియో ఒక్కొక్క మహిళకు చెంది ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.