పంజాబ్‌లో పదిరోజుల పాటు రైతుల ఆందోళన

Update: 2018-06-01 11:50 GMT

ఉత్తర భారతదేశంలో రైతులు రోడ్డెక్కారు. డిమాండ్లను పరిష్కరించాలని పదిరోజుల పాటు ధర్నా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరోజు పంజాబ్‌, మధ్యప్రదేశ్‌, హర్యానాలో రైతులు.. నడిరోడ్లపై లీటర్ల కొద్దీ పాలు, కూరగాయలు పారబోశారు. రైతుల సమ్మె సందర్భంగా ఈ నెల 6వ తేదీన మధ్యప్రదేశ్‌లో జరగనున్న ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. 11 రైతు సంఘాలు చేపట్టిన సమ్మె సందర్భంగా మార్కెట్లకు 10 రోజులపాటు పాలు, పండ్లు, కూరగాయలు సరఫరా చేసేదిలేదని రైతులు ప్రకటించారు. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని రైతులు డిమాండ్‌ చేశారు.

చమురు ధరలు పెరగడం, రైతులకు ప్రభుత్వాలు రుణమాఫీ చేయకపోవడం, రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లతో అఖిల భారత రైతు సంఘర్షణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో పలు సంఘాలు పది రోజుల పాటు సమ్మె నిర్వహిస్తున్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌ఘడ్‌, తదితర రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో హైవేలపై పాలు, కూరగాయలు, పండ్లు పారబోస్తూ నిరసన తెలిపారు. ప్రభుత్వం తమకు గిట్టుబాటు ధరలు కల్పించాలని అక్కడి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

Similar News