4 లోక్ సభ, 11 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కౌంటింగ్ శరవేగంగా సాగుతోంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి రౌండ్లలోనే బీజేపీకి గట్టి పోటీ ఎదురైంది. ఉత్తరప్రదేశ్ లో కీలకంగా భావించిన కైరానా నియోజకవర్గంలో ఆర్ఎల్డీ ముందంజలో ఉండగా, మహారాష్ట్రలోని పాల్ఘడ్లో విజయం బీజేపీని దోబుచులాడుతోంది. భండారా గోండియా నియోజక వర్గంలో బిజెపి రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక నాగాలాండ్ లోక్ సభ స్థానంలో ఎన్.డి.పి.పి ఆధిక్యంలో కొనసాగుతోంది. కైరానా నియోజక వర్గంలో బిజెపికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకం అయ్యాయి. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీకి చెందిన తబస్సుమ్ హసన్, బిజెపి అభ్యర్ధి మృగాంక సింగ్ కన్నా ముందంజలో కొనసాగుతున్నారు. 7వేల ఓట్లకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
కర్ణాటక ఆర్ఆర్ నగర్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నాడు. తొలిరౌండ్లోనే అక్కడి కాంగ్రెస్ అభ్యర్థికి 4వేలకు పైచిలుకు ఆధిక్యం దక్కింది. ఇక ఉత్తర ప్రదేశ్లోని నూర్పూర్ అసెంబ్లీ స్థానం నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో మహేస్తల లో టీఎంసీ అభ్యర్థి ఆధిక్యం కనబరుస్తున్నారు. మహారాష్ట్రలోని పాలుస్ కడేగావ్ కు జరిగిన ఎన్నికల్లో విశ్వజిత్ పతంగరావు విజయం సాధించినట్టు ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ఇక్కడ పోటీకి దిగిన బీజేపీ అభ్యర్థి చివరి క్షణంలో వైదొలగడం, ఆయన మినహా మరొకరు నామినేషన్ వేయకపోవడంతో పతంగరావు ఎన్నిక ఏకగ్రీవమైంది.