మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి డికే అరుణ మధ్య వివాదం రాజకుంటోంది. ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. ఇసుక మాఫియా ద్వారా జూపల్లి ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని డీకే అరుణ విమర్శించారు. ప్రుడెన్షియల్ బ్యాంక్లో రుణం తీసుకొని ఎగ్గొట్టారని ఆరోపించారు. దీనికి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. తనను రాజకీయంగా ఎదుర్కొలేక తన కుమారులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి పాలమూరు జిల్లా నేతల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరి నేతలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయ్. జూపల్లి అండతో జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మూడు పూవ్వులు ఆరుకాయలుగా వర్దిల్లుతోందని మాజీ మంత్రి డీకె అరుణ విమర్శించారు. అక్కడితో ఆగని డీకే అరుణ జూపల్లి కృష్ణారావు ప్రుడెన్షియల్ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టారంటూ ఆరోపించారు. ఆయన కుమారులు సైతం బ్యాంక్ల నుంచి రుణం తీసుకొని టోపీ పెట్టారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మాజీ మంత్రి డికే అరుణ వ్యాఖ్యలపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైరయ్యారు. బ్యాంక్ల నుంచి రుణాలు తీసుకోవడం తప్పేనా అంటూ ప్రశ్నించారు. 1999లో తాను ప్రుడెన్షియల్ బ్యాంక్ నుంచి తీసుకున్న మొత్తాన్ని చెల్లించానని ఎన్ఓసీ తీసుకున్నానంటూ మీడియాకు చూపించారు. తనను రాజకీయంగా ఎదుర్కొనే సత్తా లేకే...తన కుమారులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన కుమారులు ఎస్బీఐ నుంచి తీసుకున్న రుణంలో ఇప్పటికే 31 కోట్ల రూపాయలు చెల్లించారని వెల్లడించారు. తప్పుడు ఆరోపణలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలంటూ హితవు పలికారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ మంత్రి డీకే అరుణ మధ్య ఆరోపణలు కొనసాగుతాయా ? లేదంటే ఇక్కడితోనే పుల్స్టాప్ పడతాయో వేచి చూడాలి.