దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. వెలుగుల పండుగను తెలుగు రాష్ట్రాల ప్రజలు వేడుకగా జరుపుకొంటున్నారు. దీపావళి సందర్భంగా భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీపాలతో ఇళ్లను అందంగా అలంకరించుకున్నారు. మహిళలు లక్ష్మీ దేవికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పండుగ రోజున తమ ఇంట లక్ష్మీ దేవిని రా రమ్మని ఆహ్వానిస్తున్నారు. సిరి సంపదలను అందచేయలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు.దీపావళి సందర్భంగా గవర్నర్ నరసింహన్ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి గెలుపునకు దీపావళి ప్రతీకగా నిలుస్తున్నదని వారన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని, ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు వెదజల్లాలని ఆకాంక్షించారు.
మరోవైపు బాణసంచా దుకాణాల దగ్గర రద్దీ నెలకొంది. ప్రమిదలు, బొమ్మల కోసం ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. కొనుగోలుదారులతో ఈ షాపులన్నీ కళకళలాడుతున్నాయి. అయితే ఈ దీపావళి పండుగకు టపాసుల మోత తగ్గే అవకాశం కనిపిస్తోంది. పర్యావరణ పరిరక్షణ కోసం దీపావళి రోజున కేవలం రెండు గంటల పాటు మాత్రమే బాణసంచా కాల్చాలని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించడంతో టాపాసుల మోతతో పాటు అమ్మకాలు తగ్గే అవకాశం కనిపిస్తోంది.
సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రేటర్లో హైదరాబాద్లో బాణసంచా అమ్మకాలు సగానికి సగం పడిపోతాయని అంచనా వేస్తున్నారు.
దీపావళి పండగ రోజుల బాణాసంచా, పటాకులను కాల్చడానికిగాను సుప్రీం కోర్టు జారీచేసిన ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ప్రభుత్వాలు కోరాయి. రాత్రి 8గంటల నుండి 10 గంటలలోపు మాత్రమే టపాసులను కాల్చాలని సూచించాయి. అటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రహదారులు, జన సంచారం ఉన్న మార్గాల్లో భారీ శబ్దాన్ని కలగజేసే టపాసులను పేల్చడాన్ని పూర్తిగా నిషేధించినట్టు అధికారులు తెలిపారు. సుప్రీం నిబంధనలను ఎవరూ అతిక్రమించినా చట్టపరమైన కేసులు నమోదు చేయడానికి హైదరాబాద్ పోలీసులు సమాయత్తం అవుతున్నారు. రాత్రి 8గంటల నుండి 10 గంటలలోపు మాత్రమే బాణసంచా కాల్చాలని నిర్దేశిత సమయాన్ని పాటించకపోతే సుమోటోగా కేసులు పెడతామని హెచ్చరించారు.
గ్రేటర్లో ఏటా దీపావళి సీజన్లో సుమారు రూ.100 కోట్ల వరకు బాణసంచా అమ్మకాలు జరుగుతుంటాయి. మహానగరంతో పాటు పొరుగు జిల్లాల వారు కూడా ఇక్కడే క్రాకర్స్ కొనుగోలు చేస్తుంటారు. ఇందులో సుమారు రూ.20 కోట్ల వరకు ఆన్లైన్ అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. ఈసారి దీపావళి నేపథ్యంలో అధిక శబ్దం వెలువడేవి.. ఆకాశంలో కాంతులు వెదజల్లే క్రాకర్స్ను చైనా నుంచి సుమారు రూ.30 కోట్ల సరుకును నగరానికి దిగుమతి చేసుకున్నట్లు అంచనా.