తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖులను, పెద్దలను ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. సోమవారం సాయంత్రం ప్రపంచ మహాసభలకు వేదికగా నిలిచిన ఎల్బీ స్టేడియంలో పలువురు సినీ ప్రముఖులను ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. పలువురు హీరోలు, దర్శకులు, నటులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, పీపుల్స్ డైరెక్టర్ నారాయణ మూర్తి, బాహుబలి సృష్టికర్త రాజమౌళి లాంటి వాళ్లు పాల్గొన్న ఈ వేదికపై కళాతపస్వి కె.విశ్వనాథ్ లేకపోవడం లోటుగానే అనిపించింది. అయితే దానికి కారణమేంటో స్వయంగా ఆయనే చెప్పారు. ఇంతకీ ఏంటా విషయం..
ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం తెలుగువారి ధర్మం.. అందుకే హైదరాబాద్లో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభలకు వెళ్లలేకపోయా..’నని ప్రముఖ సినీ దర్శకుడు, కె.విశ్వనాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో సోమవారం రాత్రి సోషలిస్టు ఉద్యమనేత నన్నపనేని వెంకట్రావు విశిష్ట అవార్డును రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ చేతుల మీదుగా స్వీకరించి మాట్లాడారు. హైదరాబాద్ రావాలంటూ ఆదివారం సాయంత్రం తనకు ఆహ్వానం అందిందని, కొన్ని నెలలముందే తెనాలి ఎన్వీఆర్ ట్రస్ట్కు మాట ఇచ్చినందున రాలేకపోతున్నట్లు నిర్వాహకులకు చెప్పానన్నారు.