2000 రూపాయల నోట్లు, 200 రూపాయల నోట్లను జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకూ అంటారా.. మామూలుగా ఏదైనా నోటు కొద్దిగా చిరిగినా బయట చాలా మంది తీసుకోరు. తిరిగిచ్చేస్తుంటారు. కానీ, బ్యాంకులు మాత్రం వాటికి విలువ కట్టిస్తుంటుంది. అది పాత కథ. కొత్త మాటేంటంటే.. కొత్త 2000 నోటు, 200 నోటు చిరిగిందా ఇక, అంతే సంగతులు. బ్యాంకులు కూడా వాటిని తీసుకోవు. తీసుకోవట్లేదు కూడా. కనీసం సగం విలువను కూడా కట్టివ్వట్లేదు. చిరిగిపోయిన రూ.2000 నోటును మార్చుకునేందుకు కొంతకాలం ఆగాల్సిందే. ఎందుకంటే ఈ విషయమై రిజర్వ్బ్యాంక్ నుంచి ఇప్పటిదాకా ఎటువంటి నిబంధనలూ బ్యాంకులకు రాలేదు. వాస్తవంగా చిరిగిపోయిన నోటుకు ఎంత విలువ కట్టి ఇవ్వాలనే విషయమై గతంలోనే ఆర్బీఐ మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే రూ.2 వేలు, రూ.200 నోట్లకు ఈ నిబంధనలు వర్తించకపోవడంపై ప్రజలు పెదవివిరుస్తున్నారు.
రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా (నోట్ రిఫండ్) రూల్స్-2009 ప్రకారం రూ.50 పైబడిన నోట్లు చిరిగినా, పాడైనా ఒకే నిబంధనను అమలు చేస్తారు. చిరిగిపోయిన నోటులో పెద్ద భాగం ఎంత ఉందనే దాన్ని బట్టి విలువ కట్టి తిరిగి డబ్బులు ఇస్తారు. ఇప్పటివరకు 50, 100, 500,1000 రూపాయలకు మాత్రమే ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. చలామణిలోకి వచ్చిన రూ.2వేలు, రూ.200 నోట్లకు సంబంధించి ఆర్బీఐ నుంచి ఎటువంటి ఆదేశాలు రాకపోవడంతో బ్యాంకులు వాటిని తిరస్కరిస్తున్నాయి.