దక్షిణ కశ్మీర్లోని పుల్వామా జిల్లా లెత్పోరలో సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో నలుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పుల్వామా జిల్లా కేంద్రంలోని సీఆర్పీఎఫ్ శిక్షణా కేంద్రంలోకి చొరబడిన ఉగ్రవాదులు.. గ్రెనేడ్లు, తుపాకి కాల్పులతో బీభత్సం సృష్టించారు. గంటలపాటు కొనసాగిన కౌంటర్ ఆపరేషన్లో చివరకు ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే వీరిలో పదోతరగతి బాలుడు ఉన్నట్లు సైనిక అధికారులు గుర్తించారు. ఆ బాలుడు గ్రనైడ్లతో జవాన్లపై దాడి చేసే సమయంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తూ వీడియో తీశాడు. ఆ వీడియోలో భారత జవాన్ల శిభిరం పై దాడిచేయాలని ఎప్పటినుంచి అనుకున్నాం. ఈ సందేశం మీకు అందేసరికి నేను ఆ దేవుడి వద్దకు చేరిపోయి ఉంటాను. మీరు కూడా జైషే-మహ్మద్లో చేరండి’ అని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే ఈ ఘటనకు తామే పాల్పడ్డామంటూ నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ ప్రకటించింది. జైషే మహ్మద్ కమాండర్ నూర్ మొహమ్మద్ తాంత్రేను గత మంగళవారంనాడు పుల్వామా జిల్లా సంబూర గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా బలగాలు మట్టుబెట్టిన నేపథ్యంలో ఈ ప్రతీకారదాడులు చోటుచేసుకున్నాయి. దీంతో మరిన్ని దాడులు జరిగే అవకాశాలునట్టు బలగాలు అనుమానిస్తున్నాయి.