దొంగలను పట్టుకోవాల్సిన ఓ పోలీస్ అధికారిణి ఏకంగా దొంగ అవతారం ఎత్తింది. ఓ సూపర్ మార్కెట్ లోని వస్తువుల్ని ఎంచక్కా జేబులో దాచుకోవడం మొదలు పెట్టింది. ఈ తతంగాన్ని గమనించి నిలదీసిన ఆ సంస్థ ఉద్యోగి వస్తువుల్ని వెనక్కు ఇవ్వాలని కోరడంతో కోపంతో రెచ్చిపోయిన ఆమె తన భర్తతో చావగొట్టించింది. ఈ ఘటన తమిళనాడులో బుధవారం చోటుచేసుకుంది. సూపర్ మార్కెట్లో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఫోన్లో మాట్లాడుతూ వస్తువులను జేబులో పెట్టడాన్ని అక్కడే పనిచేస్తున్న ప్రణవ్ గమనించాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి చోరీ చేసిన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరాడు. అంతేకాకుండా తప్పు చేసినట్టు క్షమాపణ పత్రం రాసి ఇవ్వాలన్నాడు. మహిళా పోలీసు తన భర్తకు విషయం చెప్పడంతో అతను మరికొందరిని తన వెంట వేసుకొని సూపర్ మార్కెట్పై దాడి చేశాడు. ప్రణవ్ను ఇష్టానుసారంగా కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ వ్యవహారంతో చెన్నై పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.