ఎంపీల అలవెన్సులు పెంచిన కేంద్రం

Update: 2018-03-01 04:44 GMT

ఎంపీల అలవెన్సులు భారీగా పెరగనున్నాయి. నియోజకవర్గ, కార్యాలయ నిర్వహణ, ఫర్నిచర్ అలవెన్సులను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి అవసరమైన నిబంధనల సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎంపీలకు ఇచ్చే అలవెన్సులు పెంచాల్సిందిగా చేసిన ప్రతిపాదనను కేంద్ర కేబినెట్‌ ఆమోదించింది. 

ఎంపీలకు నియోజకవర్గ అలవెన్సులతో పాటు ఫర్నీచర్‌, కమ్యూనికేషన్‌ అలవెన్సులను పెంచాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రతిపాదన చేసింది. ప్రస్తుతం ఎంపీలకు నియోజకవర్గ అలవెన్సులు 45వేలు ఇస్తుండగా వాటిని 60వేలకు పెంచారు. దీంతో పాటు వన్‌ టైమ్‌ ఫర్నీచర్‌ అలవెన్సులను కూడా 75వేల నుంచి లక్ష రూపాయలకు పెంచారు. తాజా పెంపుతో ఎంపీల అలవెన్సులు మొత్తం రెండు లక్షల 20వేలకు పెరగనున్నాయి.

ప్రస్తుతం పార్లమెంటు సభ్యుల బేసిక్‌ వేతనం నెలకు 50వేలు. ఒక్కో ఎంపీ కోసం నెలకు కేంద్రం 2లక్షల 70వేల రూపాయిలను ఖర్చు చేస్తోంది. తాజాగా ఎంపీల అలవెన్సులు పెంచడంతో ఖజానాపై ఏటా.. 46కోట్ల అదనపు భారం పడనుంది. బడ్జెట్‌ ప్రసంగం సమయంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ఎంపీల వేతనాలకు సంబంధించి శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Similar News