దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అసెంబ్లీ స్థానాల్లో ఎలాంటి ప్రభావం చూపకపోగా...లోక్సభ ఎన్నికల ఫలితాల్లోనూ భంగపడింది. మూడు సిట్టింగ్ లోక్ సభ స్థానాల్లో బీజేపీ ఒక్క స్థానాన్ని మాత్రమే నిలుపుకోగలిగింది. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కైరానా లోక్సభ నియోజకవర్గంలో రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి తబస్సుమ్ విజయ ఢంకా మోగించారు. కైరానాలో ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ మద్దతుతో ఆర్ఎల్డీ గెలిచింది. మహారాష్ట్రలోని భండారా-గోండియా లోక్ సభ స్థానంలో బీజేపీ కంటే ఎన్సీపీ అభ్యర్థి ముందజలో ఉన్నారు. అటు నాగాలాండ్ సొలె లోక్సభ స్థానంలో ఎన్డీపీపీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్రలోని పాల్గఢ్ లోకసభ నియోజకవర్గంలో శివసేన అభ్యర్థిపై బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. పాల్గఢ్ విజయం మాత్రమే బీజేపీకి ఊరట కల్పించింది.
ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ సీఎం యోగి నేతృత్వంలోని అధికార బీజేపీకి గట్టి షాక్ తగిలింది. బీజేపీ సిట్టింగ్ నియోజకవర్గం..నూర్పూర్ లో విపక్ష సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి నయీముల్ హాసన్ ఘన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి అవినీశ్ సింగ్పై 10 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.అటు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కూ ఎదురు దెబ్బ తగిలింది. జోకిహట్ నియోజకవర్గంలో లాలూ ప్రసాద్ యాదవ్కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ అభ్యర్థి షానవాజ్ విజయం సాధించారు. జోకిహట్ నియోజకవర్గంలో జేడీయూ, ఆర్జేడీల మధ్య ప్రతిష్ఠాత్మకంగా పోరు సాగగా..చివరికి పోరుగా నిలవగా ఇందులో ఆర్జేడీ బలాన్ని చాటుకుంది. ఉప ఎన్నికల ఫలితాలు మోడీకి డేంజర్ బెల్స్ మోగించాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
ఇక కర్ణాటక రాజరాజేశ్వరి నగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి మునిరతన్ బీజేపీ అభ్యర్థి మునిరాజు గౌడపై 41వేల ఓట్ల మెజార్టీ సాధించారు. ఆర్ఆర్ నగర్ విజయంతో ఇటీవలే కర్ణాటక అధికారం చేపట్టిన కాంగ్రెస్కు మరో సీటు దక్కినట్లయ్యింది. కర్ణాటకలో మరోసీటు గెలుచుకోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.
అటు పశ్చిమ బెంగాల్లోని మహేస్తల అసెంబ్లీ నియోజకవరగ్ంలో తృణమూల్ అభ్యర్థి విజయం సాధించారు. కేరళలోని చెంగన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి గెలుపొందగా. జార్ఖండ్లోని గోమియా స్థానంలో బీజేపీ అభ్యర్థి, సిలీ స్థానంలో జేఎంఎం అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. ఉత్తరాఖండ్ థరేలీలో బీజేపీ అభ్యర్థి విజయం సాధించారు. మహారాష్ట్రలోని పాలస్ కడేగావ్, మేఘాలయలోని అంపతిలో కాంగ్రెస్ అభ్యర్థులు జయకేతనం ఎగురవేశారు. పంజాబ్లోని షాకోట్ కాంగ్రెస్ అభ్యర్థి అకాలీదల్ అభ్యర్థిపై విజయం సాధించారు.