ఆయన ప్రత్యర్ధులపై ఏదో మామూలుగా ఆరోపణలు చేసి వదిలేయరు..వాటిని నిరూపించేదాకా పట్టువదలని విక్రమార్కుడు. వదల బొమ్మాలి నిన్నొదల అంటూ తను వేసిన కేసుల్ని తానే శోధించి వాదించి సాధిస్తారు. ఆయనే వన్ అండ్ ఓన్లీ స్వామి..సుబ్రమణ్యస్వామి. ఈ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి అల్లర చిల్లర ఆరోపణలు అస్సలు చేయరు. ఆయన నోటి నుంచి వచ్చిదంటే కాగితాల ఆధారాలు ఉండే ఉంటాయి. ఇంతవరకు కేసులు అన్ని ఇలాగే ఉన్నాయి. తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆదాయానికి మించి ఆస్తుల కేసులో కటకటాల్లోకి పంపి చుక్కులు చూపించారు. అదే కేసులో శశికళను ఊచలు లెక్కి పెట్టించారు. 2జీ స్పెక్ట్రమ్ కేసులో మారన్ , కనిమొళిల్ని ముప్పతిప్పలు పెట్టించారు. ఇలా ఏ కేసు చూసినా స్వామిదే పై చేయి.
అయితే గతంలో రజనికాంత్ రాజకీయం రంగప్రవేశంపై విమర్శలు చేశారు. సూపర్ స్టార్ కి రాజకీయాల్లోకి వస్తే అట్టర్ ఫ్లాప్ అవుతారని అన్నారు. అంతేకాదు వైద్యనిమిత్తం అమెరికా వెళ్లిన రజనీ ఓ కాసినోలో గ్యాంబ్లింగ్ ఆడుతున్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవడం కోసం ఆర్కే 420 గ్యాంబ్లింగ్ ఆడుతున్నాడా? అతనికి ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఈడీ విచారణ జరపాలి అని స్వామి డిమాండ్ చేశారు.
తాజాగా తాను రాజకీయాల్లోకి వస్తున్నానంటూ ప్రకటించిన రజనీకాంత్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. నిరక్షరాస్యుడైన రజనీకాంత్.. తమిళ ప్రజలకు ఏం నేర్పిస్తాడని అని అన్నారు. ఆర్కేనగర్ ఎన్నికల్లో టీటీవీ దినకరన్ గెలుపును గుర్తుచేశారు. శివాజీ గణేషన్ రజనీకాంత్ కంటే గొప్ప వ్యక్తి.. ఆయనే రాజకీయాల్లోకి వచ్చి ఏం చేయలేకపోయారని...రజనీకాంత్ ముందు తన పార్టీ విధివిధానాలను ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.