ప్రతి ఒక్కరికీ భయం, బాధ్యత ఉండాలంటూ, వర్తమాన సామాజిక, రాజకీయాలపై అస్త్రాలు ఎక్కుపెట్టింది భరత్ అనే నేను మూవీ. ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. కానీ ముఖ్యమైన మూడు సీన్లకు కత్తెరవేశారు. సెన్సార్ బోర్డు కాదు, దర్శకనిర్మాతలు కత్తెర వేశారు. ఆ మూడు సీన్లను యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. కానీ వీటిని చూసిన తర్వాత, ఇంత ప్రభావంతమైన సన్నివేశాలను ఎందుకు తొలగించారని, సోషల్ మీడియాలో జనం ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ తొలగించిన సన్నివేశాలు....ఎందుకు తొలగించారు....పొలిటికల్, కార్పొరేట్ ఒత్తిడికి లొంగారో, ఎందుకులే పాలకులతో పెట్టుకోవడమని భయపడ్డారా.?
భరత్ అనే నేను...మహేశ్బాబు నటించిన ఈ మూవీ టాలీవుడ్లో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. 2వందల కోట్లు కలెక్షన్లు సాధించి...నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దర్శకుడు కొరటాల శివ సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు సినిమాలో తీశారు. అయితే సినిమాలోని ప్రైవేట్ స్కూల్ యాజామాన్యాల వసూళ్ల పర్వం ఎలా ఉంటుందో...ప్రజాప్రతినిధులు, అధికారులకు ఎలా తాయిలాలు ఇవ్వాలని ట్రై చేస్తారో చూపించారు. లంచం ఇస్తామంటూ చెప్పబోయిన ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాల ప్రతినిధి అయిన మంత్రి కొడుకుకు...చెంప చెళ్లు మనేలా వాయిస్తాడు.
ఈ సీన్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. విద్యా వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, తాయిలాలకు సంబంధించిన సీన్ మాత్రం....సినిమాలో పెట్టలేదు. మే 4వ తేదీన సీన్ను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే...ఇప్పటి వరకు 13లక్షల మందికిపైగా చూశారు. ఇదే సీన్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో...విపరీతంగా హిట్స్ వస్తున్నాయ్. మంచి సీన్ను ఎందుకు తొలగించారో చెప్పాలని టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. భరత్ అనే నేను మూవీలోని తొలగించిన ప్రైవేట్ స్కూళ్ల సీన్ను మళ్లీ పెట్టాలని ప్రైవేట్ టీచర్లు డిమాండ్ చేస్తున్నారు. విద్యారంగంలో జరుగుతున్న అవినీతిని వాస్తవరూపంలో చూపించారని, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ఆరాచకత్వానికి సినిమాలోని సీన్ పరాకాష్ట అని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు షబ్బీర్ అలీ అంటున్నారు. ఒత్తిళ్లతో చిత్ర నిర్మాతలు సీన్ తీసేశారని...ఇది క్షమించరానిదంటున్నారు.
భరత్ అను నేను మూవీలో తీసేసిన సీన్ లో ఏమాత్రం అశ్లీలం లేదంటున్నారు టీపీటీఎఫ్ ప్రతినిధులు. ఇప్పటికైనా దర్శక నిర్మాతలు స్పందించి...సినిమాలో తిరిగి ఆ సీన్ ను చేర్చాలని కోరుతున్నారు. కానీ కార్పొరేట్ కాలేజీల చదువుల దోపిడీపై మొదటి నుంచి ఉద్యమస్థాయిలో కథనాలను ప్రసారం చేస్తోంది హెచ్ఎంటీవీ. చదువుల ఒత్తిడితో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని మానవీయ కథనాలను టెలికాస్ట్ చేస్తోంది. సెలవుల్లోనూ స్పెషల్ క్లాసెస్, స్టడీ అవర్స్ అంటూ నిబంధనలను తుంగలో తొక్కుతున్న వైనాన్ని వెలికితీసింది హెచ్ఎంటీవీ. మాదాపూర్లోని ఓ కార్పొరేట్ కాలేజీలో హాలిడేస్లోనూ క్లాసులు నిర్వహించడమేంటన్న హెచ్ఎంటీ ప్రతినిధిపై సదరు కళాశాల ప్రతినిధులు దాడికి తెగబడ్డారు.