మహారాష్ట్ర ఔరంగబాద్ లో దారుణం జరిగింది. కంచే చేను మేసింది. తన దగ్గర పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ కూతురిని డీసీపీ రేప్ చేశారు. 23 ఏళ్ల యువతికి మంచి జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడటమేకాక వేధింపులతో నరకం చూపించాడు. డీసీపీ రాహుల్ శ్రీరామ్ పై ఔరంగాబాద్ ఎండీసీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కూతురికి ఏదైనా మంచి ఉద్యోగం చూసిపెట్టమని డీసీపీ రాహుల్ శ్రీరామ్ను అభ్యర్థించింది మహిళా కానిస్టేబుల్. ఆ సాకుతో యువతిని ఇంటికి పిలిపించుకున్న ఆ డీసీపీ తన పాడుబుద్ధిని ప్రదర్శించాడు. అంతటితో ఊరుకోకుండా నెలల తరబడి ఆమెను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేశాడు. అతని హింస తారాస్థాయికి చేరడంతో బాధితురాలు కొద్దిగా ధైర్యం తెచ్చుకుని జరిగిన విషయాన్ని తన తల్లికి చెప్పింది. ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లి డీసీపీ రాహుల్పై ఫిర్యాదు చేశారు.
మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు డీసీపీపై ఐసీపీ 376, 417,323,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత యువతిపై డీసీపీ ఫిబ్రవరి, జూన్ నెలల్లో వరుస వేధింపులకు పాల్పడ్డాడని, శ్రీరామే ప్రస్తుతం సెలవులో ఉన్నాడని, కేసును విచారిస్తున్న డీసీపీ వినాయక్ ధాక్నే తెలిపారు. పోలీసు విభాగంలోని ఓ ఉన్నతాధికారే వేధింపులకు పాల్పడుతున్నాడన్న విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఔరంగాబాద్ కమిషనర్ చిరంజీవ్ ప్రసాదే డీసీపీ శ్రీరామేను సెలవుపై పంపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీ ఈ విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉన్నందునే డీసీపీపై కమిషనర్ ముందస్తు చర్యలు తీసుకున్నారని అంటున్నారు. చివరికి విషయం బయటకు పొక్కడంతో సీఎం ఫడ్నవీస్పై ఎన్సీపీ విరుచుకుపడింది. హోంశాఖను సక్రమంగా నిర్వర్తించడం చేతకాకపోతే ఫడ్నవీస్ తప్పుకోవాలని సూచించింది. పోలీసుశాఖలో పనిచేసే మహిళలకే ఈ దేశంలోరక్షణ కరువైందని చెప్పడాని ఈ ఉదంతమే నిదర్శనమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.