తిరుమల వెంకన్నపై కనిమొళి షాకింగ్‌ కామెంట్స్‌

Update: 2018-01-11 06:23 GMT

కరుణానిధి కుమార్తె కనిమొళి  కలియుగ ప్రత్యక్ష దైవం పై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. కోట్లాది మంది భక్తులు కొలిచే కోనేటి రాయుడిపై డీఎంకే నాయకురాలు చేసిన షాకింగ్‌ కామెంట్స్‌ తీవ్ర దుమారం రేపేలా ఉన్నాయి. ఈ మధ్యే 2జీ స్కాం నుంచి బయటిపడిన కనిమొళి  కొండల్లో కొలువైన గోవిందుడిపై చేసిన వ్యాఖ్యలు షేక్‌ చేస్తున్నాయి. 

తండ్రి కరుణానిధి రూట్‌నే  కూతురు కనిమొళి ఫాలో అవుతున్నారు. రాముడి కంటే రావణుడే గొప్పని గతంలో తండ్రి కరుణానిధి  చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరిచిపోక ముందే  ఆయన కూతురు కనిమొళి తిరుమల వెంకన్ననే టార్గెట్‌ చేశారు. కోట్లాది రూపాయలు కానుకలుగాసమర్పించే కోటీశ్వరులకే తిరుమలేశుడు దేవుడని కనిమొళి చేసిన  షాకింగ్ కామెంట్స్ వివాదస్పదంగా మారాయి.

కలియుగ ప్రత్యేక్ష దైవం  ముందు అందరూ సమానమేనని కొందరు నీతులు చెబుతుంటారని.. కానీ అదంతా వట్టిదేనని కనిమొళి అభిప్రాయపడ్డారు. తిరుచ్చిలో జరిగిన నాస్తిక సమాజం మహానాడు లో ఈ వ్యాఖ్యలు చేశారు. డబ్బులేని వారు రోజులు,  గంటల తరబడి ఎందుకు పడిగాపులు  కాస్తున్నారని అసలు  పేదవాడిని కాపాడలేని దేవుడు అక్కర లేదని తనదైన స్టైల్‌లో ప్రశ్నలు సందించారు. తన సొంత హుండీని కాపాడుకోలేని దేవుడు భక్తులను ఎలా కాపాడుతారని సూటిగా ప్రశ్నించారు. నిజంగా శ్రీవారికి శక్తులే ఉంటే ఆయనకు భద్రత ఎందుకని ఘాటుగా వ్యాఖ్యానించారు.  ప్రపంచ యుద్ధాల కంటే మతాల వల్ల చిందిన రక్తమే అధికమని కనిమొళి అన్నారు.   

జాతి, మత ఘర్షణలు, వాదాలను నిర్మూలించాలంటే మానవతావాదాన్ని, నాస్తికవాదాన్ని వ్యాపింపజేయాలని కనిమొళి ఇచ్చిన పిలుపుపై  భక్తులు, హిందూ మతపెద్దలు మండిపడుతున్నారు. ఆమె దగ్గర కూడా కోట్ల డబ్బులు ఉన్నాయని మరి తానేందుకు  ప్రత్యేక దర్శనాలకు వెళ్తుంటారని మండిపడ్డారు. కనిమొళి వ్యాఖ్యలు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని జాతీయ భద్రత చట్టం కింద ఆమెను అరెస్ట్‌ చేయాలని వెంకన్న భక్తులు డిమాండ్‌ చేశారు. పైగా వెంకన్నపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు ఆమె వెంటనే క్షమాపణ చెప్పాలని  డిమాండ్ చేస్తున్నారు.  

Similar News