తమిళనాడు లోని ఆర్కేనగర్ ఉప ఎన్నికలో భారీగా డబ్బులు చేతులు మారిందనే ఆరోపణలకు బలం చేకూరుతోంది. దినకరన్ వర్గం ఒక్కో ఓటుకు సుమారు 10 వేల వరకు చెల్లించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలు నిజమేనన్నట్టుగా కొన్ని ఆధారాలు కూడా బయటపడటం ఇప్పుడు కలకలం రేపుతోంది. దినకరన్ కు సహకరించిన వారిలోనే కొంత మంది మధ్య విబేధాలు తలెత్తడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఆర్కే నగర్లో ఓటర్లకు రూ. 20ల టోకెన్లు పంపిణీ చేసిన దినకరన్ వర్గీయులు నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 21న జరిగిన ఆర్కే నగర్ ఉప ఎన్నిక పొలింగ్ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల చేతుల్లో ఇరవై రూపాయల కరెన్సీనోట్లు కనిపించాయి. ఒకే వరుస నెంబర్లు కలిగిన ఆ నోట్లపై కొన్ని నెంబర్లు పెన్నుతో రాసి ఉండటం జరిగింది. ఓటేసిన తర్వాత ఆ నోటును ఓ చిరునామాదారుడి వద్ద ఇచ్చి ఓటర్లు రూ.10 వేల చొప్పున తీసుకున్నారని అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు ఇండిపెండెంట్గా పోటీచేసిన దినకరన్ వర్గీయులపై ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున 450 మందికి ఆ ఇరవై రూపాయల నోట్లను టోకెన్లుగా ఇచ్చినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.
న్యూవాషర్మెన్ పేటకు చెందిన కార్తికేయన్ అనే ఓటరు దినకరన్ అనుచరుడైన జాన్పీటర్వద్దకు వెళ్లి తనకెందుకు ఆ టోకెన్ ఇవ్వలేదని గొడవపడ్డాడు. ఆ సందర్భంగా జాన్పీటర్ అతడిపై దాడి జరిపాడు. ఈ మేరకు కార్తికేయన్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ జరిపి టోకెన్లు పంచిపెట్టారనే ఆరోపణపై జాన్ పీటర్, చరణ్రాజ్, రవి, సెల్వం అనే నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద జరిపిన విచారణలో న్యూ వాషర్మెన్ పేటలో 450 మందికి రూ.20 నోట్లపై నెంబర్లు రాసి ఉన్న టోకెన్లు పంపిణీ చేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు.